Virat Kohli – Ayodhya Ram Mandir: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22వ తేదీన రామమందిర ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మహోన్నత వేడుక హాజరు కావాలంటూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందుతోంది. సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ, రామాలయ ప్రారంభం 22వ తేదీన భారీ స్థాయిలో జరగనుంది. కాగా, రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు రావాలంటూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది.
విరాట్ కోహ్లీతో పాటు అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఆహ్వాన పత్రికను నేడు అందించారు రామమందిర ప్రతినిథి. కోహ్లీ, అనుష్క ఆహ్వన పత్రికలు అందుకున్న ఫొటో సోషల్ మీడియాలో బయటికి వచ్చింది.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం ఈ మహోత్తర ఘట్టం జరగనుంది. రాముడి జన్మభూమి అయిన అయోధ్యను ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా అత్యంత విశిష్టమైన ప్రాంతంగా ప్రజలు భావిస్తారు.
మరోవైపు, రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అయోధ్యకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆ నగరంలో హోటల్ గదుల ధరలు.. చాలా రెట్లు పెరిగిపోయాయి. అయోధ్యలో ప్రస్తుతం హోటళ్లు తక్కువగానే ఉండటంతో డిమాండ్ విపరీతంగా ఉంది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలుస్తోంది.